జగనన్న విద్యా కానుక: ఆరు వస్తువులతో కిట్లు

సాక్షి, అమరావతి :  ‘జగనన్న విద్యా కానుక’ కిట్స్‌ కొనుగోలుకు పరిపాలనా సంబంధిత అనుమతులు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కిట్లు కొనుగోలుకు మొత్తం రూ. 655.60 కోట్లు వ్యయం కానుంది. సమగ్ర శిక్షణ కేంద్ర పథకం ద్వారా ఈ కిట్లు పంపిణీ చేస్తారు. ఇందులో రాష్ట్ర వాటాగా రూ. 262.24 కోట్లు వెచ్చించనుంది.







ఆరు రకాల వస్తువులతో కిట్లు..
కాగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులందరికీ వచ్చే విద్యా సంవత్సరం నుంచి ‘జగనన్న విద్యా కానుక’ కింద ఆరు రకాల వస్తువులతో కూడిన ప్రత్యేక కిట్లను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. 1వ తరగతి నుంచి 10 తరగతి వరకు చదివే 42 లక్షల మందికి పైగా విద్యార్థులకు ఈ కిట్లను అందిస్తారు. ప్రతి కిట్‌లో 3 జతల యూనిఫామ్‌ క్లాత్, నోట్‌ పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, షూ– 2 జతల సాక్స్‌లు, స్కూల్‌ బ్యాగ్, బెల్టు ఉంటాయి. యూనిఫామ్‌ కుట్టించేందుకు అయ్యే ఖర్చులను విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వమే జమ చేస్తుంది. వేసవి సెలవుల అనంతరం స్కూళ్లు తెరిచే నాటికి ఈ కిట్లను పంపిణీ చేయనుంది.